మడిసైపుట్టాక కుసింత కళాపోసనుండాల!

బాపు, రమణ కలిసి సృష్టించిన అద్భుతమయిన సినిమాలలో ‘ముత్యాల ముగ్గు’ ఒకటి. రావుగోపాలరావు తెలుగు సినిమాలలో ఎన్నటికీ నిలిచిపోయే డైలాగులతో విలన్ పాత్ర పోషించారు ఈ సినిమాలో. మచ్చుకి ఒక సన్నివేశం.

(అప్పుడే తెల్లవారుతూ ఉంటుంది. ఎర్రటి అకాశంలో సూర్యుడు ఉదయిస్తుంటాడు. పరకడుపునే చుట్టకాలుస్తూ సూర్యోదయం చూస్తుంటాడు విలన్ రావుగోపాలరావు.

సెగట్రీ: నారాయుడొచ్చాడండి.
రావు: వచ్చాడా తీసుకొచ్చావా?
సెగట్రీ: యెస్సర్. తీసుకొచ్చాను చూస్తారా?
(నారాయుడిని మర్డర్ చేయిస్తాడు రావుగోపాలరావు. నారాయుడి బాడీని రావుగోపాలరావుకి చూపించటానికి తెచ్చాడు సెక్రెట్రీ.)
రావు: అబ్బా సెగట్రీ ఎప్పుడూ పనులూ బిజినెస్సేనా? యే? పరగడుపునే కుసుంత పచ్చిగాలి పీల్చి ఆ పత్యక్షనారాయుడి సేవ చేసుకోవద్దూ?
సెగట్రీ: యెస్సర్
రావు: యెస్సర్ గాదు. కళ్ళెట్టుకు సూడు…..పైనేదో మర్డర్జరిగినట్టు లేదూ? ఆకాసంలో సూర్రుడు నెత్తురు గడ్డలా లేడూ?
సెగట్రీ: అద్భుతం సార్!
రావు: మడిసన్నాక కాసింత కళా పోసనుండాలయ్యా! ఉత్తినే తిని తొంగుంటే మడిసికీ గొడ్డుకీ తేడా యేటుంటాది? !
అలా మన అధునికాంధ్ర విలన్లను కూడా కళాభిమానులు చేస్తారు, బాపు, రమణ.