మడిసైపుట్టాక కుసింత కళాపోసనుండాల!

బాపు, రమణ కలిసి సృష్టించిన అద్భుతమయిన సినిమాలలో ‘ముత్యాల ముగ్గు’ ఒకటి. రావుగోపాలరావు తెలుగు సినిమాలలో ఎన్నటికీ నిలిచిపోయే డైలాగులతో విలన్ పాత్ర పోషించారు ఈ సినిమాలో. మచ్చుకి ఒక సన్నివేశం.

(అప్పుడే తెల్లవారుతూ ఉంటుంది. ఎర్రటి అకాశంలో సూర్యుడు ఉదయిస్తుంటాడు. పరకడుపునే చుట్టకాలుస్తూ సూర్యోదయం చూస్తుంటాడు విలన్ రావుగోపాలరావు.

సెగట్రీ: నారాయుడొచ్చాడండి.
రావు: వచ్చాడా తీసుకొచ్చావా?
సెగట్రీ: యెస్సర్. తీసుకొచ్చాను చూస్తారా?
(నారాయుడిని మర్డర్ చేయిస్తాడు రావుగోపాలరావు. నారాయుడి బాడీని రావుగోపాలరావుకి చూపించటానికి తెచ్చాడు సెక్రెట్రీ.)
రావు: అబ్బా సెగట్రీ ఎప్పుడూ పనులూ బిజినెస్సేనా? యే? పరగడుపునే కుసుంత పచ్చిగాలి పీల్చి ఆ పత్యక్షనారాయుడి సేవ చేసుకోవద్దూ?
సెగట్రీ: యెస్సర్
రావు: యెస్సర్ గాదు. కళ్ళెట్టుకు సూడు…..పైనేదో మర్డర్జరిగినట్టు లేదూ? ఆకాసంలో సూర్రుడు నెత్తురు గడ్డలా లేడూ?
సెగట్రీ: అద్భుతం సార్!
రావు: మడిసన్నాక కాసింత కళా పోసనుండాలయ్యా! ఉత్తినే తిని తొంగుంటే మడిసికీ గొడ్డుకీ తేడా యేటుంటాది? !
అలా మన అధునికాంధ్ర విలన్లను కూడా కళాభిమానులు చేస్తారు, బాపు, రమణ.

పూల సరసాలు

చాలానాళ్ళకు మళ్ళీ సమయం చిక్కింది. ఎన్నాళ్ళనుండో చదవాలని తీసి ఉంచిన తాపీ ధర్మారావు సాహిత్య మొర్మొరాల పై మనసు మళ్ళింది. సాహిత్య మొర్మొరాలు విశాఖ తీరంలో అప్పుడే వేసిన పకోడీలా కరకరలాడుతాయి.

ఇక విషయానికి వస్తే,

పూలు అమ్మే అమ్మాయిలకు తెలుగులో ఒక ముద్దు పేరుంది, పుష్పలావికలని. పుష్పలావికలతో సరస వర్ణన తప్పని సరి అని తెలుగు ప్రభంధ కవులకు నియమం ఒకటుంది. మహా ప్రభంధాలలో ఉండవలసిన పద్దెనిమిది వర్ణాలలో ఇది ఒకటి. పురవర్ణన, సూర్యోదయ వర్ణన, రతి వర్ణనలా అన్నమాట. కవి ఎంత మడికట్టుకున్నా ఇది మాత్రం తప్పదు. మన తెలుగు కూడా ఇందుకు తగినట్టే ఉంది.

పుష్పలావికలు అమ్మే పూలు, సంపెంగలు, మల్లెలు, తామరలు, కలువలూ లేదా ఈ పూలతోనే చేసిన దండలు, చెండ్లూనూ. తెలుగులోని ఉపమానాలూ ఇక్కడ పూర్తిగా కవులకు సహకరిస్తాయి. ప్రియురాలి కళ్ళు కలువలనీ, తామరలనీ, దంతాలు మల్లెమొగ్గలనీ, కైదండలు (చేయి, భుజము వగయిరా) పూలదండలని మన కవులు ఎప్పుడో నిర్ధారించారు.

మన తెలుగు వాడికి లోటేమిటి, “నీ దండ ఎంతకిస్తావు?” అన్న ప్రశ్న అమాయకం కావచ్చు, కానీ పుష్పలావిక “నా దండ నువ్వు కొనలేవు” అంటే, మరివేరే అర్థం స్ఫురించక మానదు. ఇది రాసినది ఎవరో కాదు, శ్రీ కృష్ణదేవరాయలు!

వెలదీ యీని దండ వెలయెంత?
నాదండకు వెలబెట్టన్ ఎవ్వరితరంబు

ఇలా అతిసున్నితమయిన సరసాన్ని పండించారు మనకవులు!

తడిగుడ్డతో మూసిన చెండ్లకు “ఏదీ, ఆ చెండ్లు చూడనీ” అంటే, కపటం లేని ఆసక్తే కావచ్చు. కానీ “బేరం కుదరనీ, చూపిస్తాను” అని ఆమె అనగానే చిన్న నవ్వు నవ్వక తప్పదు.

ప్రభంధ కవులు ఇంకొంచం ముందుకు పోయి రాస్తారు. వసు చరిత్ర లోని రెండు వాఖ్యాలు చూడండి.

------- తమ్ములనేల మోసివే సతీ!
మూయదగదే మానస భూనిధానములవి!

తమ్ములంటే తామరలు. ఎండకు వాడిపోకుండా తామరలను మూసి ఉంచుతుంది పుష్పలావిక. “ఏమి మొగ్గలను మూసి ఉంచావు?” అని అడుగుతాడు యువకుడు. ఇవి ‘మానసభూనిధానములు’ మూయకుండా ఉంచుతానా? అంటుంది పుష్పలావిక! మానససరోవరంలో దొరికిన పూవులంట అంచేత వాటిని కాపాడనా అని బదులు చెప్పంది.

ఇక నర్మగర్భంగా కవి ఏమన్నాడో మీరే గ్రహించాలి!

బుడుగు రాతలు

(బుడుగు ఒక గడుగ్గాయి. ప్రపంచంలో ఈ సైజు పిల్లలకు ప్రతినిధి. పిల్లల్లో పెద్దగా, పెద్దల్లో పిల్లగా వుంటాడు. జట్కా తోలాలని, వింజను నడపాలని కుతూహలం. బుడుగుకి చిన్ని ప్రేమించే హృదయం వుంది. పలక మీద బుడుగు రాసిన ప్రేమలేఖ ఇది.)

సీ గాన పెసూనాంబలు గారికు,
ఇది లౌ లెటరు రాస్తున్నానన్నమాట. బాబాయి ఇచ్చిరా అంటే రెండు జెళ్ళ సీతకి ఇచ్చానే అలాంటిదన్నమాట. బాబాయికి కూడా కుంచెం రాయటం వచ్చనుకో. నేను వచ్చినంత కాదనుకో, అయినా నేనేం చిన్న వాడినా! లేకపోతే చితకవాడినా!

నీ కసలేం రాదు కదా! నీకు బాహా రావటం కోసం కుంచెం కుంచెం రాస్తాను. లేపోతే బోలెడు ఇంకా చాలా రాసేయగలను. లౌ లెటరు అంటే ప్రేమించుకోవడంట. బాబాయి చెప్పాడు. నాకు తెలియదు అనుకో. బామ్మ రామకోటి రాస్తుంది ఏమీ తోచక, బాబాయి లౌ లెటరులు రాస్తాడు. బాబాయికి పని దొరకలేదుట కదా. ఇలా అని నాన్న అన్నాడు. అయినా పని దొరుకుతుందేమిటి? గోళీలు అయితే దొరుకుతాయి గాని.

అంమ ఏమీ రాయదు. అంమకి పాపం గుడింతాలు కూడా రావు. అందుకని నాన్న తలకి బొబ్బర్నూనె రాస్తుంది. నేను వద్దన్నా “ఊహు” వినదు. ప్రవేటు చెప్పి అయినా రాస్తుంది. పాపం చదువు రాదుకాదా అందుకని నేను వూరుకుంటాను. ప్రేమ గుడ్డిదని బాబాయి చెప్పాడు. బామ్మ కళ్ళజోడు నేను పెట్టుకునేప్పుడు తీసికెళ్ళి పోతానే అప్పుడు బామ్మ గుడ్డిది అయిపోతుంది కదా అట్టాంటిదన్నమాట. బాబాయి కాయితాల మీద రాస్తాడనుకో! నేను పలకమీద గుండ్రంగా రాయాలిట. ప్రేమించుకునే వుత్తరాలు తీసుకోరుట. ప్రేమంటే అచ్చంగా యిచ్చెయడంట ఒఠొఠిగా కాదు. నిఝెంగానన్నమాట…

ఇహ ప్రెవేటు మాష్టరు వచ్చినా పలక ఉండదన్న మాట. నువ్వు అవకతవకగా రాసి నా పలక ఇచ్చేకూడదు, సిన్మాలోలాగా త్యాగం యిచ్చేయడం అన్నమాట.

(పలక రెండువైపులా నిండిపోయిందోచ్!)

పొగతాగనివాడు

పొగతాగనివాడు దున్నపోతై పుట్టున్

కన్యాశుల్కం నాటకంలో నవ్వుల పంట పండించే పాత్ర గరీశానిది. ఇతర పాత్రల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని గిరీశం వదిలే ఢాంభికాలు మనల్ని మాత్రం కడుపుబ్బా నవ్విస్తాయి.

చుట్టపై గరీశం ఏమంటాడంటే,

“చుట్టకాల్చడం యొక్క మజా నీకింకా బోధపడకపోవడం చాలా ఆశ్చర్యంగా వుంది. చుట్ట కాల్చబట్టే కదా దొర్లంత గొప్పవాళ్ళయినారు. చుట్టకాల్చని ఇంగ్లీషువాణ్ణి చూశావూ? చుట్టపంపిణీ మీదనే స్టీముయంత్రం వగయిరా తెల్లవాడు కనిపెట్టాడు. లేకపోతే వాడికి పట్టుబణ్ణా? శస్త్రకారుడు యేవన్నాడో చప్పానే. సూత ఉవాచ-


ఖగపతి యమ్రుతము తేగా
భుగభుగమని పొంగి చుక్క భూమిని వ్రాలెన్
పొగచెట్టై జన్మించెను!
పొగతాగనివాడు దున్నపోతై పుట్టున్


(ఇంద్రుడు స్వర్గానికి అమృతం తీసుకొనివస్తుండగా పొగలు కక్కుతున్న అమృత కలశం నుండి ఒక చుక్క క్రింద పడింది. ఆ అమృతబిందువు నుండి పొగచెట్టు, అనగా పొగాకు పుట్టింది. అట్టి పొగ త్రాగని వారు మరుజన్మలో దున్నపోతై జన్మిస్తారని తమ శిష్యునతో సెలవిస్తున్నారు గరీశం గారు. )

రుక్కులు

తెలుగు కవితను మరోప్రపంచానికి తీసుకువెళ్లిన మహాకవి శ్రీ శ్రీ . పరిచయాలు ప్రస్తావనలు అవసరం లేని శ్రీ శ్రీ కవిత్వం ఇలా సాగుతుంది…

కుక్క పిల్లా, అగ్గి పుల్లా, సబ్బు బిళ్ళా-
హీనంగా చూడకు దేన్నీ!
కవితామయమేనోయ్ అన్నీ!

రొట్టెముక్కా, అరటితొక్కా, బల్లచెక్కా-
నీ వేపే చూస్తూ ఉంటాయ్!
తమ లోతు కనుక్కోమంటాయ్!

ఇలా శ్రీ శ్రీ , తెలుగు కవితా వస్తువులలో కుక్క పిల్లను, అగ్గి పుల్లను, విశ్వవృష్టిని అన్నింటిని కలిపేసారు, తెలుగు సాహత్యం లో చిరస్థాయిగా నిలిచిపోయారు.

(ఈ పద్యం శ్రీ శ్రీ మహాప్రస్థానం లోనిది.)

విశ్వంభర

సి. నారాయణ రెడ్డి రచించిన మహాకావ్యం విశ్వంభర. సి నా రె అన్నట్లు ఈ కావ్యాని కి నాయకుడు మానవుడు. రంగ స్థలం విశాల విశ్వం.

నేను పుట్టకముందే
నెత్తిమీద నీలితెర.
కాళ్ళ కింద ధూళి పొర.

అని ప్రారంభం అయ్యే విశ్వంభర మనిషి చేసిన ప్రతి మహాప్రస్థానాన్ని సుమధురంగా ఆవిష్కరిస్తుంది.

ఒక్క మాట

ఒక్క మాట


తెలుగు వెలుగులు అందరితో పంచుకుందామని ఇది ఓ ప్రయత్నం. కన్యాశుల్కం నుండి కాంతం కథల వరకు అమృతం లాంటి తెలుగు కావ్యాలను ఇక్కడ పున:స్మరణ చేయటానికి ఇదొక ఆకాంక్ష.