తమసోమా... (Part 2)

 

తమసోమా...
(Part 2)


మరుసటి రోజు 

తెల్లారింది. తూర్పున లోయ వెనుక బంగాళా ఖాతం నుండి సూర్యుడు పొడిచాడు. 


రోజూ వేసే పీ.ఈ.టీ ఈల ఆ రోజు వినపడలేదు. హాస్టళ్లలో ఒక నిశ్శబ్దం. రోజూ పక్షుల గోలలా కావ్ కావు అనే పిల్లల అరుపులు లేవు. 

ఎల్లారావు ఎప్పటిలాగే ఉదయాన పాలు, గుడ్లు ఉడకబెట్టి ఉదయానే ఇచ్చే స్నాక్ తయారు చేశాడు. మెస్ బయట పెట్టి ఎదురు చూస్తున్నారూ ఎల్లా రావు ఇంకో స్టాఫ్. 


ఒక్క కుర్రాడు గానీ ఒక్క అమ్మాయి  కూడా రాలేదు  పాలకి, గుడ్లకి !  అన్ని గుడ్లు పాడవకూడదు , పిల్లలు తినాలి ఎల్లారావు తపన.  హాస్టల్ కిందకి వచ్చి అరుస్తున్నాడు. తమ్ముడూ వచ్చి తీసుకోమని. ఒకరిద్దరు వెళ్లారు.

వచ్చి రూంలోకయినా పట్టుక వెళ్ళండి అని అంటున్నాడు ఎల్లారావు. అయిష్టంగా ఇద్దరు బకెట్లు పట్టుకుని వెళ్ళారు.  ఆ ఉదయం ఎవ్వరో తప్ప తిండి ముట్టలేదు. 


కిట్టు లేచాడు, తన బెడ్డు ఎదురుగా లోయ. లీలగా, తుప్ప మొక్కల సందు లోంచి నూతి కనిపిస్తుంది. ఇది పీడ కలా నిజామా చెప్పలేని పరిస్థితి. పుస్తకం తీశాడు, అది వాడికి ఒక ఎస్కేప్, చుట్టూ ప్రపంచం నచ్చనప్పుడు తనకు పలాయన మార్గం పుస్తకాలు . 

అటు వెళ్తూ బమ్మర్ సింగ్ చూసాడు, చీ...నీ.... అని వెళ్ళిపోయాడు. కిట్టుకి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. పుస్తకం మూసాడు. 


ట్రంకు పెట్టి చిన్న సిమెంటు బల్లమీద ఉండేది, కిటికీ పక్కనే. పక్కకు జరిపి తూర్పుకు చూస్తున్నాడు, కాళ్ళు కడుపులో పెట్టి ఒత్తిగిలి కూర్చున్నాడు. 

బమ్మర్ సింగ్ మళ్ళీ వచ్చాడు. దగ్గరకి. బెంగగా ఉందా అన్నాడు? కిట్టు మొహం తిప్పాడు. వాడు సారీ చెప్పాడు. ఇప్పుడు ఏమై ఉండి ఉంటాది అని ఊహాలోచనలు చేస్తున్నాడు. అసలు సినిమాకి పారిపోయి ఇప్పుడు వెనక్కి వస్తే అన్నయ్య పరిస్తితి ఉంటాది అని జోక్ వేశాడు. బాగా నవ్వు తెప్పించడానికి. ఆ జోకు ఇంకా చెప్తా అని వెళ్ళిపోయాడు. 


నమ్మ శక్యం లేని విషయం. ఎక్కడైనా తప్పు జరిగే ఉంటుంది అని దేవుళ్ళకి దండం పెట్టుకుంటూ ఉన్నాడు. 

కిరణ్ వచ్చాడు, కాసేపటికి చక్రి, శేషు, అందరూ చేరారు. కిరణ్ కి కొంచెం ఎక్కువ తెలిసినట్టు ఉంది. ముగ్గురన్నయలు నీటి కోసం వెళ్ళారని. ఒకరు మాత్రమే బయటికి కచ్చితంగా రాలేదు అని. 

మొగ్గ తొడిగిన ఆశ మీద అరికాలు పెట్టి తొక్కినట్టు అయ్యింది. 


దూరంగా కలవలం, ఒక మంచాన్ని ఎవరో ముందటి  చిన్న మైదానం లో పెడుతున్నారు. దీపం ఒకటి పెట్టారు. ఒకరు కొబ్బరి ఆకు వేస్తున్నారు మంచం మీద. 

ఎవరో ఒక ఫోటో తెచ్చారు. ఎదురుగా పెట్టారు. 


అన్నీ అక్కడ ఉన్న నాలుగు అమ్మాయిల హాస్టళ్లకు, 2 అబ్బాయిల హాస్టళ్లకు కనిపిస్తున్నాయి. 

తాతయ్య మాస్టార్, ఇంగ్లీష్ మాస్టర్, ఇంకొక స్టాఫ్ ఒక తివ్వాచితో కిందకి వెళ్తున్నారు. పిల్లల గుండెలు చెరకు రసం మరలోకి వెళ్తున్న చెరకు గడల్లా నలిగి పోతున్నాయి. 


ఉత్కంఠ లో ఆ అరగంట.

క్షణమొక యుగమయ్యింది ఆ గంటలో. 


ముగ్గురూ తివాచీ పట్టుకుని వస్తున్నారు. ఇందాక బమ్మర్ సింగ్ చెప్పినట్టు అవ్వలేదు అన్నమాట. 

బాల్యంలో ఒక అమాయకత్వం ఉండేది కిట్టు లో. అకాల మృత్యువు 

ని చూడని బాలుడిలో ఉండే ఒక సురక్షిత భావం అది. ఆ రోజు ఒక పసివాడి అమాయకత్వం పోయింది.


ఎప్పుడూ మాట్లాడటానికి పది మంది ఉండే నవోదయలో, 

ఎదుటివారిని ఇంటి గుమ్మంలోని మల్లె తీగ లాగ చూసేవాడు. దండిగా ఉండి, వద్దంటే పువ్వులిచ్చేది సంఘం అని. ఆ రోజు అనిపించింది ఎవ్వరూ శాశ్వతం కారు అని. 


ఎదుటి కిరణ్, శేషు, ఇంకెవరో అందరినీ పదే చూసాడు. అందరూ పోయే వారే ఏదో ఒక రోజు. 

మృత్యువు అంచులు అప్పటికి రెండు మూడు సార్లు చూశాడు కిట్టు. పొట్టలోని జన్మతః ఉన్న అవశేషం పేగులను తుఫానులా నుమ్మలు చుట్టినప్పుడల్లా కిట్టు ఇంచు మించు జీవన ముక్తి వరకూ వెళ్లేవాడు. భూ జల అగ్ని వాయు వ్యోమ భూతాలు వదిలే సమయాన కలిగే పరవశం చూసాడు తనలో. తన మృత్యువు అమృతంగా అనిపించినా ఎదుటి వారి చావు ఇంతగా బాధిస్తున్న మానవత్వం అనుబంధం  తనలో ఎలా వచ్చిందా అనే విషయం అర్థం కాలేదు. క్రితం అనుకున్నాడు మళ్ళీ కడుపు నొప్పి వస్తే ఈ మారు వెనక్కి రాకూడదు అని. మనసు మారింది తనకు సులభం తన వారికి అది కష్టం అని.. 


ఆలోచనల వర్షంలో ఉన్న కిట్టూ ఎదురుగా ఉన్న విపరీతం గ్రహించలేదు. కిటికీ నుండి స్పష్టంగా కనిపిస్తున్నాడు శ్రీధర్ అన్నయ్య, రెండు చేతులారా ఒడిసి పట్టి అక్కడ పెడుతున్నారు ఒక మాస్టారు. మాస్టారు కళ్ళు ప్రవహిస్తున్నాయి. 

ఆజానుబాహుడు, గరళం మింగిన శివునిలా ఉన్నాడు. అతని చుట్టూ ఒక వలయంలో పిల్లలు వరుసలో వచ్చి చూసి వెళ్తున్నారు. ఎవరో ముక్కులో దూది పెట్టారు వింతగా. పటం పక్కన దీపం లో నూనె వేస్తూనే ఉన్నారు. 


గంటలో ఒక కారు వచ్చింది. చీర నోటికి అడ్డం పెట్టుకొని ఒక అమ్మగారు. విగ్రహం లా చలనం లేని ఒక నాన్న. కారు చుట్టూ మనుషులు, వెనుక స్కూల్ వేన్ లో అన్నయ్య పార్దివదేహం. 

అప్పటివరకూ గడ్డ కట్టిన కాలం దూకింది ముందుకు. పసుపు పంచారు ఎవరో, హాస్టల్లో దండిగా నీరు పడుతుంది. సింటాక్స్ ట్యాంక్ నిండింది. పసుపుతో తల స్నానం చెయ్యాలని పుకారు, అందరూ చేశారు. 


ఎల్లారావు మళ్ళీ బిగ్గరగా పిలుస్తున్నాడు.


ఇప్పుడు కోపంగా చిరాకుగా ఉన్నాడు.

ఎవరో ఒకరు ముందు అడుగు వెయ్యాలి. 

ఎవ్వరికి చలనం రాలేదు మెస్ కి వెళ్లేందుకు.


హౌస్ మాస్టర్లు ఒక్కో రూముకి వచ్చి పిల్లల్ని ఒక్కరొక్కరుగా పేరుపేరునా పట్టుకుని మెస్సుకి తీసుకువెళ్తున్నారు. 

కిట్టు కూడా చేరాడు. తల స్నానం చేసి వచ్చిన అమ్మాయిల జుట్టు విరబోసుకుని ఉన్నారు. తుఫాను వెలిసిన తీరంలా వారి ముఖాలు..


అన్నం ముట్టుకునే ధైర్యం ఎవరికి లేదు.  

కిట్టు అన్నం తిని పూర్తిగా 24 గంటలు అయ్యింది. వార్త వచ్చిన సాయంత్రం ముందు మధ్యానం తిన్నాడు చివరిగా. 


ఎవరో మొదలు పెట్టారు ...


అహం వైశ్వానరో భూత్వా

ప్రాణినాం దేహమాశ్రితః ।

ప్రాణాపాన సమాయుక్తః

పచామ్యన్నం చతుర్విధమ్ ॥


అన్నిటిని జ్వలించే శక్తి ఒకటుందని రుజువు చూసారు అందరూ.

ఓం శాంతిః శాంతిః శాంతిః అన్నారు అందరూ. 


అనాదిగా పుట్టిన ఓంకారం,  వెనుక అనే శాంతి మంత్రం తమ మాయాజాలం చేశాయి. 


..........


మూడేళ్లు గడిచాయి. 

 

ఆ రోజు 1999 ఆగస్టు మాసం.


పది, పన్నెండు తరగతుల్లో ఉన్నత మార్కులు వచ్చిన వారిని పిలిచారు నవోదయకు.


కిట్టు వచ్చాడు స్నాతకోత్సవానికి. కిట్టు మెడలో బంగారు పతకం.


పతకం మీద శ్రీధర్ స్మారక పతకం అని రాసి ఉంది. 


అన్నయ్య జ్ఞాపకార్థం వారి కుటుంబం ఏర్పాటు చేసిన బహుమతి అది.


దశాబ్దాలు గడిచినా అందరికీ పదిహేనేళ్ల అన్నయ్యే శ్రీధర్

No comments: