తమసోమా...
(Part 1)
కిట్టూ కి ఆ రోజు అన్నిరోజుల లాగే సామాన్యంగానే తెల్లవారింది. హర్యానా వెళ్లిన పిల్లలు వెనక్కి వచ్చేశారు. ప్రతి ఏడాది 30 మంది పిల్లలను హర్యానా పంపించేవారు. అక్కడే తొమ్మిది పది చదువు.
తొమ్మిదో తరగతి నుండి పదికి వచ్చిన క్లాసు పిల్లల అల్లరి తారా స్థాయికి చేరింది. కిట్టు బెడ్డు నుండి వారి అరుపులు వినిపించేవి రాత్రి వరకూ.
ఆ ఏడాది మొదటి సారి, కేవలం ఒక్క సంవత్సరానికి కుదించారు మైగ్రేషన్. చాలా సంతోషంగా ఉంది వాతావరణం. వచ్చిన పిల్లల కథలు వారు చూసిన విశేషాలు వింటూ బాగా నవ్వుతూ గడుపుతున్నారు.
ఆ నవోదయ నగర్ లో అన్నీ చక్కగా ఉండినా, వేసవిలో ఒక పెద్ద ఉపద్రవం వచ్చి పడేది. కరెంటు లేక స్కూళ్లో నీటి ఎద్దడి విపరీతంగా ఉండేది. బయటి నుండి నీరు తెచ్చుకునే అవకాశం లేదు వియ్యంపేట లా. బోరింగులకు ఆ రోజుల్లో అంత లోతు వేసే అవకాశం లేదు.
కిట్టు నవోదయ వచ్చి మొదటి సారి ఆకలి అంటే ఏమిటో తెలుసుకున్నాడు. ఒక్క రాత్రి భోజనం మర్చిపోతే మరుసటి రోజు 9 వరకూ ఘన పదార్థం దొరికేది కాదు. బాగా పలచని పాలు తాగడం చాలా కష్టం అనిపించేది.
కానీ ఆకలిని మించిన గండం నీటి ఎద్దడి.
నాలిక పిడచ కట్టుకు పోయేది అర్ధ రాత్రుల్లో.... మెస్ వరకూ వెళ్ళాలి అంటే చీకటి భయం. ఇంకా పామూ పుట్రా తిరుగాడే రోజులవి. ఉదయం లేస్తే ముందుగా అవసరం నీరు, అప్పట్లో బయటకు వెళ్ళిపోయేవారు. ఇప్పుడా అవకాశం లేదు, చుట్టూ తుప్పలతో కారడవి. ముక్కు మూసుకుని ఎక్కడో ఒకటో రెండో మగ్గుల నీటిని సంపాదించి పని ముగించే వారు.
దయనీయమయిన రోజులవి. స్నానాదుల కోసం నీరు కావాలి అంటే పల్లం లో ఒక వంద అడుగుల కిందకు ఒక వ్యవసాయ బావి ఉండేది. అక్కడ పెద్ద కుర్రాళ్ళు తోడు తుంటే బకెట్లలో ఒక పావు మాత్రం నింపి మానవ హారం వేసి నీటిని పయి వరకూ తెచ్చు కానీ వారు.
వియ్యంపేట లో బోరింగు దగ్గర పడిన కష్టానికి ఇది వంద రెట్లు అన్నమాట.
ఇక్కడితో అయితే కిట్టు బాగానే అందరితో పాటు చలామణి అయ్యేవాడేమో...
అసలు పెద్ద ఆపద , కిట్టూ కి వేరే ఉంది. కిట్టు పెద్దగా వాచిన టాన్సిల తో ఇబ్బంది పడేవాడు. పిల్లలో టాన్సిల్ ఉంటే రాత్రి నిద్రలో ఒంటేలు అయిపోతుంది. కిట్టూ కి వారానికి రెండు మూడు సార్లు జరిగేది.
అమ్మ రబ్బరు షీట్ పెట్టేది. అదీ షీట్ బెడ్డు కింద గోప్యంగా పెట్టుకునే వాడు కిట్టు. చూసి నవ్వే వారు నవ్వే వారు. స్కూళ్లో మంచిగా నీరు ఉన్నపుడు అది చాలా ఇబ్బంది అనిపించినా, మధ్యలో లేచి మొత్తం బెడ్డు మార్చి దుప్పటి తడిపి. కొత్తది ఉంటే వేసి పడుకునేవాడు. మల్లా ఆరు కల్లా మార్నింగ్ రన్నింగ్ ఉండేది.
మరి ఈ కరువులో ఉపద్రవం అంటారే అది కిట్టు పరిస్థితి. వియ్యంపేటలో ఉన్న బోరింగ్ వలన చాలా గుట్టుగా నడిపే ఈ రాత్రి పనికి ఇప్పుడు అసలు అవకాశం లేదు. వీటి మీద అప్పుడప్పుడు వచ్చే పెయిన్ ఎటాక్.
అలాంటి నీటి ఎద్దడి రోజుల్లో ప్రాణం బిక్కు బిక్కు మనేది. తను దొరుకుతుందిలే అని అనుకునే తిండి, నీరు, గాలి ఇలాంటివి కూడా ఎద్దడి వస్తుంది అని తెలిసొచ్చింది.
ఆ బావి ఉండేది లోయలో, లోయను అనుకుని ఉన్న పీఠభూమి మీద ఉండేది మెస్సు. మెస్సు పక్కనే ఒక్కటే హాస్టల్ ఉండేది ఆరోజుల్లో. ఆ హాస్టల్లో లోయ కనిపించేలా కిట్టు బెడ్. అద్భుతమయిన లోయ అందాలు, రాత్రి వేసే గాలుల ఆహ్లాదం దొరికేవి వాడికి.
వేసవి కొంత ఉపశమించింది. కరెంట్ పూర్తిగా రావడం మొదలయ్యింది. కష్టాలు తీరాయి రాయ్ అని కొంత హుషారు పిల్లల్లో..
అలాంటి ఒక సాయంత్రం వచ్చిన వార్త.
మోట బావిలో.. అన్నయ్య..
శ్రీధర్ అన్నయ్య మునిగి పోయాడు.
కిట్టూ కి గుండె జారింది. పడుతూ లేస్తూ పరిగెత్తాడు. ఎదురుగా తన సొంతూరి శ్రీధర్. కొంత ఉపశమనం. మరి ఆ శ్రీధర్ ఎవరు ? ఇద్దరు శ్రీధర్లు ఉన్నారు టెన్త్ లో.
ఒక్క క్షణం వచ్చిన ఉపశమనం వెంఠనే మాయం అయ్యింది.
హర్యానా వెళ్లి వచ్చిన శ్రీధర్.
శ్రీధర్ ఆ వేసవి కే హర్యానా నుండి వెనక్కి వచ్చాడు. అజాను బాహుడు. భగీరథ ప్రయత్నం కథలో శివుడి బొమ్మలాంటి మొహం, శివుని లాంటి పొడవాటి గళం.
ఎదురుగా తనను ఆదరించే సీనియర్లు, కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నారు.
ఇంకా దొరకవచ్చు అని కొందరు. అగ్నిమాపక దళం రావడం , గజ ఈత గాళ్ళు, చిన్న నిక్కర్లు వేసుకుని వెళ్లడం చూస్తున్నారు కిటికీ లోంచి. అంతా రెండో వింగ్ లో చేరారు. అందరికీ కర్ఫ్యూ. ఒకరిద్దరు పెద్ద కుర్రాళ్ళు అంటే పన్నెండు లో ఉన్నవారు మాత్రం అజమాయిషీ చేస్తున్నారు.
ఈత గాళ్ళు వెతుకుతూనే ఉన్నారు. కాలం తన పని చేసుకు పోతుంది. ఆగని ఆఘమేఘాలమీద సూర్యుడు కొండ వెనక్కు పోతున్నాడు.
కాసేపటికి పెద్ద పెద్ద పెట్రో మాక్స్ దీపాలు తీసుకు పోతున్నారు.
మొదట కంగారు.
తరువాత ఆతృత.
ఆత్రుత నెమ్మదిగా
ఆందోళనగా మారింది.
ఆందోళన
ఉత్కంఠ అయింది.
ఉత్కంఠ చివరికి
విషాదంగా కూర్చుంది
ఆ సాయంత్రం మీద.
ఒక ఉజ్వల కాంతి ఆరిపోయింది.
ఆ రాత్రి కారిన కన్నీటిలో అమాయకమైన బాల్యం తడిసి ముద్దయ్యింది
No comments:
Post a Comment