పంజాబ్ సింధు గుజరాత్ మరాఠా ద్రావిడ...

 పంజాబ్ సింధు గుజరాత్ మరాఠా ద్రావిడ...


రూములో సామాన్లు వెతుక్కుంటున్నాడు కిట్టు. అన్ని ఒక్కొకటి దొరికాయి. అన్ని ఉన్నా సంచుల్లో సామాను పైకి కిందకి మారాయి ప్రయాణంలో. 

బెడ్డు పరిచే ఉంది. పక్కన కొత్త తువ్వాలు, బ్రష్, టూత్ పేస్ట్, సబ్బు. రూమ్ 8th క్లాస్ పిల్లలది. వీళ్లకి వేరే చోటు కాకుండా ఉన్న పిల్లల మధ్యే బెడ్డు ఇచ్చారు.

గోడల నిండా క్రికెట్ పోస్టర్లు. అన్నీ పసుపు రంగు టీంవే, అంటే ఆస్ట్రేలియా. స్టీవ్ వాహ్, షేన్ వార్న్ అలా. ఇదేదో చాలా బాగుందే అనుకున్నాడు. పక్క రూంలో అంతా వెస్ట్ ఇండీస్ అలా ఉంది.


రూంలోకి జుట్టు విరబోసుకుని చిన్న తెల్ల నిక్కర్ వేసుకుని ఆరడుగుల అబ్బాయి తన దగ్గరకు వచ్చాడు.

మే రా నామ్ సుర్జీత్ సింగ్ సాంఘా. అన్నాడు. 


స్కూల్ ప్రిఫెక్ట్ అంట.

చోటా మద్రాసీ. అచ్ఛా లగ్ రహా హై.


ఏమి కావాలన్నా తనని అడగమన్నాడు. ఈ అతిథి కార్యక్రమం వాడిది అంటున్నాడు.

జుట్టు పట్టుకుని కిట్టు అడిగాడు. దీనిని ఏం చేస్తావ్ అని.


అడక్కూడనిది అడిగేసానా అని గాభరా.

మద్రాసీ మస్త్ బందా అన్నాడు.


స్నానం చేసి రమ్మన్నాడు. కిందకు చూపించాడు. ఆ చిన్న పిల్లాడి పేరు గురుముఖ్ అంట. వెనకాలే వచ్చాడు. 


కట్టెల పొయ్య మీద ఇత్తడి పీపాలో నీళ్లు వేడి చేసుకోవాలి. అప్పటికే నీళ్ళు అయిపోయాయి. ఇద్దరూ పక్కన ఉన్న వ్యవసాయ పంప్ దగ్గరకి వెళ్లి నీళ్లు తెచ్చారు.


రెండు మూడు చెంబులు వేసి పొయ్య ఎగదోశారు. వాడు నేను వెళ్ళిపోవాలి అని వెళ్ళిపోయాడు.


కిట్టు నీళ్లు తెరుపుకుని, స్నానానికి వెళ్ళాడు. ఇప్పుడు ఏకాంతం. ఎక్కడా ఉండదు నవోదయలో ఏకాంతం, ఇలా ఎప్పుడో.


స్నానం చేసి బయటకి వచ్చాడు, ఖాళీ చాటి మీద ఎర్రటి ఎండ. మధ్యాహ్నం ఒంటిగంట కావస్తుంది. ఇప్పటికి వేడి వచ్చింది సూర్యుడికి.


కళ్ళు మూసుకున్నాడు కాసేపు.

రెప్పల వెనుక ఎర్రటి తెర.


సంక్రాంతి. సింధూరం సినిమా. విశాఖ ఎక్స్‌ప్రెస్. గోదావరి వంతెన. దద్దోజనం ముద్ద. కిషన్ రెడ్డి. కిరీటం పెట్టుకుని జానీ. గుర్తుకు వచ్చారు.


జానీ. తలచుకుంటేనే మెదడులో ఎడమ నుండి కుడికి కుడి నుండి ఎడమకి విద్యుత్ తిరుగుతుంది. వింత ఊహలు. తన ఉంగరాల జుట్టు. సొరంగంలో చీకటి. వాక్‌మాన్‌లో పాటలు. ఇది నిజమేనా అనుకున్నాడు. తను తప్పు చేస్తున్నాడా అనే భావం.


పవిత్రంగా బ్రిలియంట్ ట్యుటోరియల్ గుర్తుకువచ్చింది. సరస్వతి మంత్రం చెప్పాడు.

వచ్చిన మంత్రాలు అన్నీ చదివేశాడు.


ఎండను చూస్తూ,

భర్గో దేవస్య ధీమహి

ధియో యో నః ప్రచోదయాత్॥


తనకు తప్పో ఒప్పో నీవే చూపించాలి అనుకున్నాడు ఎండను చూస్తూ.

ఇంకా ఆకలి గుర్తుకు వచ్చింది. బెడ్డు వరకూ చేరాడు.


కిందనుండి కేకలు ఇంగ్లీష్‌లో హోసూరు పిల్లలు, తెలుగులో రారా నాయనా అని జానీ.

ప్లేట్లు వేళ్ళమీద తిప్పుకుంటూ అంతా మెస్ చేరారు.


జానీ అంటుంది ఒరేయ్ కిట్టు ఇక్కడ ఎవ్వరికీ తెలుగు రాదు. మనం ఏమన్నా వీళ్ళకి తెలీదు అని.

వింతగా ఉంది చండీగఢ్ భోజనం. సలాడ్ అని ముల్లంగి, కాబేజీ పెడుతున్నారు. మసి పట్టిన రొట్టెలను లైన్ కట్టి మరీ వేసుకుంటున్నారు పిల్లలు. ఉడికీ ఉడకని అన్నం, వాము వేసి చావల్ అని పెడుతున్నారు. ఆకలికి మీద పెట్టింది తిని రూమ్‌కి వచ్చేశాడు.

సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు అంట. ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చిన ఒక్క అబ్బాయ్ వీడు కాబట్టి, వీడు సాంప్రదాయక బట్టలు కట్టి నడవాలి అందరి ముందు. చిరాకు వచ్చింది. జానీ వచ్చింది, నేను చీర కట్టుకుంటాను సాయంత్రం ఫంక్షన్‌కి అని. తను ఇక్కడ ఒకే ఒక్క తెలుగు అమ్మాయి.


కొంచెమైనా రెస్ట్ కావాలి అని రూమ్‌కి వచ్చాడు.

ఇప్పుడు సాంఘా , ప్రిఫెక్ట్ వచ్చాడు. స్నానం చేసినట్టు జుట్టు తడిగా ఉండి, తడి తువ్వాలు తలకు చుట్టుకుని. 


తనను ఇంకో వాడిని గుమ్మంలోకి తీసుకువెళ్ళాడు.

తెల్ల చీర లాంటి బట్ట తెచ్చాడు. ఖాదీ బట్ట.


కిందకు తగలకుండా ఒక చివర కిట్టూ చేతిలో పెట్టాడు. నేలకి తగలకూడదు. ఇంకో చివర వేరే కుర్రాడికి ఇచ్చాడు.

దువ్వెన తీసి తల దువ్వాడు. కొప్పు లా చేస్తూ, ఆ తెల్ల బట్టని తలకి కడుతున్నాడు. గట్టిగా లాగి కడుతున్నాడు. తను ఇంకా బలంగా లాగమని కిట్టూకి చెప్పాడు.


ఎంత గట్టిగా లాగితే అంత మంచి పగిడి వస్తుంది అంట.


దువ్వెన పాగా లో పెట్టాడు. ప్యాంటు కి ఒక వెండి రంగు తొడుగులో ఉన్న చిన్న కత్తి పెట్టుకున్నాడు. చేతికి ఉన్న కడియం పేరు కడా అని, దువ్వెన కంగా అని, చాకు క్రిపాణ్ అని, తెల్లటి నిక్కరు కచ్ఛేరా అని. 

కేశ్, కంఘా, కడా, కచ్ఛేరా, క్రిపాణ్. ఇవే సిక్కు లకు పవిత్రం అన్నాడు. కిట్టు అనాయాసంగా అక్కడ ఉన్న పటానికి దండం పెట్టాడు. 




మద్రాసి ప్యారా హై అని. సాయంత్రం కలుద్దామన్నాడు. 


సాయంత్రం అయ్యింది. తెల్ల పంచి ఎలాగోలా కట్టాడు, కిందన నిక్కరు వేశాడు ఎందుకయినా మంచిది అని. తెల్ల చొక్కా వేసుకున్నాడు.


రాష్ట్రాల పేర్లు పిలుస్తుంటే వెళ్ళాలి. స్టేజి మీద మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. వెళ్ళాడు. పక్కన జానీ. పసుపు చీర, ఎర్రటి బొట్టు. సంక్రాంతికి అలంకరించిన గుమ్మం లా కనిపించింది కిట్టూకి.


చప్పట్లు కొట్టారు. స్టేజి వెనక వెళ్ళి వేచి ఉండమన్నారు. మళ్ళీ చివరలో రావాలి అంట.


స్టేజి దిగగానే, సాంఘా వచ్చాడు. చోటా మద్రాసీ ఛలో అని.


రూముకి వెళ్ళి బట్టలు మార్చుకుని రమ్మన్నాడు.


గేటు దగ్గరకు నలుగురు పిల్లలు, కిట్టు, సాంఘా.


రిజిస్టర్‌లో ఏదో రాశాడు.


సాంఘా ఉంటే ఎవరూ అడ్డు చెప్పటం లేదని అర్థం అయ్యింది. నడుస్తున్నారు. నీలం తెలుపు రంగుల్లో అక్కడి ఆర్టీసీ బస్సులు. చిల్లర ఉంటే చాలు. ఎక్కడికైనా సునాయసంగా వెళ్ళి రావచ్చు అంట. నవోదయ దగ్గర అయితే డబ్బులు లేకపోయినా పరవాలేదు అంటున్నాడు గురు ముఖ్. 


దిగిన బస్టాండ్, ఎదురుగా గుడి లాంటి కట్టడం. మసీదు గుడి కలిపి కడితే ఎలా ఉంటుందో అలా ఉంది.


బయట చెప్పులు వదిలిన చోట టోకెన్, ఇంకా ఒక పెద్ద రుమాలు ఇచ్చారు.


సాంఘా కిట్టు గాడి బుర్రకి కట్టాడు. ఇది తియ్యకూడదు అని. లోపలికి వెళ్ళేవాళ్ళు ఆడవాళ్లు బుర్ర మీద చున్నీ, మగ వాళ్ళు రుమాలు లేక పాగా వేసుకుని వెళ్తున్నారు.


పాలరాతి కట్టడం. కాళ్ళు చేతులు ముడుకులు మోచేతుల దాకా కడుక్కోవాలి.


లోపలికి వెళ్ళారు. ఎదురుగా గురు నానక్ ఫోటో. గురు నానక్ జయంతి సెలవులు ఇస్తారు అని తెలుసు ఇక్కడ ఏకంగా ఆయనకి గుడి ఉంది. లోపల చాలా గురువుల ఫోటోలు ఉన్నాయి.


ఒక చిన్న బెడ్డు లాంటి చోట దుప్పటి కప్పి ఉంచారు. చాలా భక్తితో పడుతున్నారు. వాహే గురు.. వాహే గురు.. అని.


కిట్టు క్షణంలో లీనం అయిపోయాడు. దేవుడికి దండాలు పెడుతున్నాడు. తన లిస్టులో ఉన్న కోరికలు.


కళ్ళు మూసుకుని ఉన్న వీడిని లాక్కుంటూ పోయారు.


పూజా కర్నే లాగా మద్రాసీ అని. నవ్వుతున్నారు.


కిందకి వెళ్ళారు అంతా.


అక్కడ ఒకామె ఉంది. ఇంచుమించు ఆరు అడుగులు, అన్ని అవయవాలు అధిక మోతాదులో ఉన్న ఆవిడను వింతగా చూసే లోపే, ఆమె కాళ్ళకి దండాలు పెట్టేస్తున్నారు. వీడి బుర్రను నొక్కి, వీడి చేత కూడా కాలు మొక్కించారు.


ఆవిడ దీవిస్తుంది..


కిందకు వెళ్ళమని ఆదేశం.

సెల్లార్ లాంటి చోటకి వెళ్ళారు.

శుభ్రంగా ఉంది. కాళ్ళు చేతులు మళ్ళీ కడిగారు సబ్బుతో, కిట్టు తలకి నెట్టు పెట్టారు.


చేతిలోకి పప్పు ఉన్న బకెట్ ఇచ్చారు. మిగతా నలుగురికి వేరే వేరే. అందరికన్నా చిన్నవాడికి నీటి మగ్గు. కొంచెం గర్వంగా ఉంది కిట్టూకి, తనకి పప్పు బకెట్ ఇచ్చినందుకు.


లోపల వెళ్లగానే నేలమీద పంక్తులుగా కూర్చుని జనాలు ఉన్నారు. కిట్టు పప్పు వేసుకుంటూ వెళ్ళమని ఆదేశం. వీడు వేస్తూ పోయాడు. తగ్గించి వెయ్యమని, మళ్ళీ అడిగితే వెయ్యాలి అని మరో ఆదేశం. ఒక రౌండ్ వేసే లోపు మళ్ళీ రెండో విడత పప్పు వెయ్యటం. అలా ఎంత సేపు చేసారో తెలీదు.


వీళ్ళని వెళ్ళి బకెట్లు వెనక పెట్టి కూర్చోమన్నారు. ఐదుగురూ ఆవురావురు మంటూ కడుపు నిండా తిన్నారు.

బయటికి వచ్చేసరికి ఎనిమిది దాటింది.


దీనిని లంగర్ అంటారు అంట, ఇక్కడ సేవ చేస్తే అనుకున్నది సాధించే ఏకాగ్రత వస్తుంది అంట.

అలసి మెట్ల మీద కూర్చున్నారు.


లోపల నుండి సాయంత్రం భజన మొదలయ్యింది


ఇక్ ఓంకార్

సత్ నామ్

కర్తా పురఖ్

నిర్భౌ

నిర్వైర్

అకాల్ మూరత్

అజూనీ

సైభంగ్

గుర్ ప్రసాద్


ఒకే ఓంకారం

అదీ సత్యం

అదే కర్త

నిర్భయ

నిర్ వైరీ

కాలం లేని

మొదలు లేని

స్వయంభూ

ఇది గురు ప్రసాదం.


కాసేపు లాగి మద్రాసీ అన్నాడు సాంఘా.


కిట్టుకి తన లోపలి భావం చెప్పే  హిందీ రాదు.


పంజాబ్ సింధు గుజరాత్ మరాఠా ద్రావిడ ఉత్కళ వంగా అన్నాడు జవాబుగా.



No comments: